Police: గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనలో నిందితుడి అరెస్ట్!

  • నరసరావుపేటలో మృతురాలి బంధువుల ఆందోళన
  • కేసు నీరుగార్చే ప్రయత్నాలంటూ ఆరోపణలు
  • నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు
Police announced the arrest of the culprit who killed women with tractor

గుంటూరు జిల్లాలో రమావత్ మంత్రూబాయి అనే గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డిని  అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మృతురాలి బంధువులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఉదయం ఆందోళనకు దిగారు. నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. దాంతో పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూబాయి, మంత్రూనాయక్ భార్యాభర్తలు. అటవీభూముల్లో సాగుచేసుకుంటూ ఆ భూమిలో రెండున్నర ఎకరాలపై హక్కులు పొందారు. అయితే రెండేళ్ల కిందట ఆ పొలం పనుల కోసం, ఇంటి అవసరాల నిమిత్తం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలంగా అప్పుతీర్చాలంటూ శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. దీనిపై ఇరువురికి పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో తన అప్పు తీర్చకుండా పొలంలో పనులు చేసుకునేందుకు వెళుతున్నారన్న అక్కసుతో శ్రీనివాసరెడ్డి ఘాతుకానికి పాల్పడ్డాడు. పొలానికి వెళుతున్న మంత్రూబాయి, మంత్రూనాయక్ లను తన ట్రాక్టర్ తో అటకాయించాడు. మాటామాటా పెరగడంతో తన ట్రాక్టర్ తో గిరిజన మహిళ మంత్రూబాయిని తొక్కించాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

More Telugu News