Supreme Court: బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన సుప్రీం కోర్టు

  • లాక్ డౌన్ రోజుల్లోనూ యథేచ్ఛగా బీఎస్-4 అమ్మకాలు
  • అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
  • విచారణ ఆగస్టు 13కి వాయిదా
Supreme Court ordered no registration for BS Four vehicles

తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు లాక్ డౌన్ కాలంలో విక్రయించిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లను జరుపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యంత పరిశుభ్ర ఉద్గారాలు వెలువరించే బీఎస్-6 సాంకేతికతను తాము ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సంకల్పించి, మార్చి 31తో బీఎస్-4 వాహనాలకు తుది గడువు నిర్దేశిస్తే, మార్చి 31 తర్వాత కూడా బీఎస్-4 వాహనాల అమ్మకాలు కొనసాగాయని సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతకుముందు, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా బీఎస్-4 వాహనాలు మిగిలిపోయాయంటూ ఆటోమొబైల్ డీలర్లు కోర్టును ఆశ్రయించగా, కోర్టు 10 రోజుల వ్యవధిలో 10 శాతం బీఎస్-4 వాహనాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, తాము నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మొత్తంలో బీఎస్-4 వాహనాలు అమ్ముడవడం సుప్రీం కోర్టును అసహనానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ ఆగస్టు 13కి వాయిదా వేసింది.

More Telugu News