Rahul Gandhi: రాఫెల్ విమానాలు భారత్‌ చేరిన నేపథ్యంలో.. మోదీ సర్కారుకి రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు

  • ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్లు కదా
  • రూ.1670 కోట్లకు ఎందుకు పెరిగింది?
  • 126 విమానాలు అడిగితే, 36 మాత్రమే ఎందుకు కొంటున్నారు?
  • కాంట్రాక్టును అనిల్ అంబానీకి ఎందుకిచ్చారు?  
Rahul Gandhi attacks Centre

ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ అభివృద్ధి చేసిన రాఫెల్‌‌ యుద్ధ విమానాల్లో ఐదు నిన్న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. భారత్‌ కొనుగోలు చేసిన 36 యుద్ధ విమానాల్లో భాగంగా ఐదు హర్యానాలోని అంబాలకు చేరుకున్నాయి. రాఫెల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని మొదటి నుంచి వాదిస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా మరోసారి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేశారు.  

ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు ఎందుకు పెరిగిందని రాహుల్ ప్రశ్నించారు. అలాగే, మన ఎయిర్ ఫోర్స్ 126 విమానాలు అడిగితే, కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారని ఆయన నిలదీశారు. యుద్ధ విమానాల రూ.30,000 కోట్ల కాంట్రాక్టును దేశీయ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు కాకుండా, దివాలా తీసిన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ప్రాజెక్టులో స్థానిక భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన సంస్థను డసో ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.

More Telugu News