Bonda Uma: కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని చంద్రబాబు చేస్తున్నారు: బోండా ఉమ

  • ఆళ్ల నాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు
  • కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్న బోండా ఉమ
  • ఏపీలోనే అత్యధిక కేసులు వస్తున్నాయని వెల్లడి
Bonda Uma says Chandrababu have been doing corona job better than AP government

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై టీడీపీ నేత బోండా ఉమ ఘాటుగా స్పందించారు. కరోనాపై ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ రోజు కరోనాపై ప్రభుత్వం చేయాల్సిన పనిని చంద్రబాబు చేస్తున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కరోనాను ఎలా అదుపు చేయాలనే విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు నిపుణులతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. కానీ, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం చేతగాక చేతులు ఎత్తేసిందని విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా రోగుల పరిస్థితి ఘోరంగా ఉందని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం నిజం కాదా? అని బోండా ఉమ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తిగా మారిందని ఆరోపించారు.

More Telugu News