India: ఆ వార్తలు అవాస్తవం.. ఇండియాను దూరం చేసుకోబోమన్న ఇరాన్!

  • రైల్వే ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు వార్తలు
  • అవాస్తవమని స్పష్టం చేసిన పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్
  • ఇండియా పెట్టుబడులు ఎన్నో ఉన్నాయన్న ఫర్దార్ మాంటాసర్
Iran Clarifies on Train Project

ఆఫ్గనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఇండియాను తప్పించారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇండియా తమకు మిత్రదేశమని, ఇండియాను వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు.

'జహేదాన్-చాబహార్ రైల్వే ప్రాజెక్టు నుంచి ఇండియాను తప్పించినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. చాబహార్ ప్రాంతంలో ఇండియాతో రెండు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఒకటి పోర్టుల్లో యంత్రాలు, ఇతర పరికరాల సరఫరా నిమిత్తం, రెండోది 150 మిలియన్ డాలర్ల ప్రాజక్టు' అని ఆయన వ్యాఖ్యానించినట్టు న్యూస్ ఏజన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది.

 చాబహార్ పోర్ట్ లో ఇండియా పెట్టుబడులు ఎన్నో ఉన్నాయని, వాటిల్లో రైల్వే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా ఉందని అన్నారు. కాగా, భారత ప్రాతినిధ్యం కూడా లేకుండానే నిలిచిపోయిన రైల్వే ప్రాజెక్టును ఇరాన్ ప్రభుత్వం చేపట్టనుందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News