CPI Ramakrishna: సునీల్ దేవధర్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం: సీపీఐ రామకృష్ణ

  • అన్ని రంగులను కాషాయీకరణ చేస్తామన్న సునీల్ దేవధర్
  • సునీల్ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్న రామకృష్ణ
  • బీజేపీ ప్రమాదకరంగా తయారైందని వ్యాఖ్య
CPI Ramakrishna faults Sunil Deodhars comments

ఏపీలో ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులపై విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణరాజు సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తుండటం... ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు వేడిని పుట్టిస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, విజయసాయిల మధ్య కూడా ట్విట్టర్ ద్వారా మాటల తూటాలు పేలాయి.

టీడీపీ మిడతల దండు కమలం పువ్వుపై వాలబోతోందని విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ చీకటి మిత్రుడు అనే కోణంలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందిస్తూ... ఒక్క పసుపునే కాదు, అన్ని రంగులను కాషాయీకరణ చేయగలమని వ్యాఖ్యానించారు.

సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. రాజకీయాల్లో నిబద్ధత గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. అన్ని రంగులను కాషాయీకరణ చేస్తామని సునీల్ దేవధర్ చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజేపీ ప్రమాదకరంగా తయారైందని విమర్శించారు. బీజేపీలో చేరగానే అంతా శుద్ధులుగా మారతారా? అని ప్రశ్నించారు.

More Telugu News