ys sharmila: నాన్న గురించి ఈ పుస్తకంలో అమ్మ ధైర్యంగా నిజాలు చెప్పింది: వైఎస్ షర్మిల

  • నాన్న జీవిత విశేషాలపై అమ్మ పుస్తకం రాసింది 
  • హృదయాన్ని తాకే విధంగా ఉంది
  • తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కొత్త కోణాన్ని తెలిపింది
  • నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పింది
ys sharmila about vijayamma book on ysr

మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆయన అర్ధాంగి విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ... 'నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన పుస్తకమే "నాలో.. నాతో వైఎస్సార్‌‌''. ఇది చాలా మంచి పుస్తకం.. హృదయాన్ని తాకే విధంగా ఉంది' అని తెలిపారు.

'నాన్నకు సంబంధించిన విశేషాలను ఈ పుస్తకంలో కొత్త కోణంలో తెలుసుకోవచ్చు. తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కోణాన్ని తెలుపుతూ అమ్మ ఈ పుస్తకం రాసింది. ఈ విధంగా నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

'వారిద్దరితో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు భావించాను. నిజం చెప్పడం సులభం కాదు .. అయినప్పటికీ ధైర్యంగా అమ్మ నిజం చెప్పింది. ఈ పుస్తకంలో నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను తెలిపింది. వైఎస్సార్ గొప్ప స్ఫూర్తిమంతమైన వ్యక్తి. ఆయనను జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది. అందుకే అమ్మ ఈ బుక్‌ రాసింది' అని షర్మిల చెప్పారు.

వైఎస్సార్‌ అందరికీ ఒక స్ఫూర్తి అని వైఎస్ షర్మిల అన్నారు. "నాలో.. నాతో వైఎస్సార్‌‌'' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. వైఎస్సార్ జీవిత విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. అందరూ వైఎస్‌ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.

More Telugu News