DK Shivakumar: ఎట్టకేలకు కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న డీకే శివకుమార్

  • మార్చి 11న నియామక ప్రకటన
  • కరోనా వ్యాప్తితో ఇన్నాళ్లుగా వాయిదా పడిన ప్రమాణస్వీకారం
  • ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న శివకుమార్
DK Shivakumar has taken oath as Karnataka Congress Chief

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మంది మాత్రమే హాజరైన ఓ కార్యక్రమంలో కేపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు వీలుగా 15 వేల ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక, ఈశ్వర్ ఖంద్రే, సలీమ్ అహ్మద్, సతీశ్ జర్కిహోళి కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పదవీప్రమాణం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ గత అధ్యక్షుడు దినేశ్ గుండూరావు లాంఛనంగా కాంగ్రెస్ పతాకాన్ని శివకుమార్ కు అందించారు.

వాస్తవానికి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా శివకుమార్ నియామకం మార్చి 11నే జరిగింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ప్రమాణస్వీకారోత్సవం ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. వొక్కళిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. ఆయనకు కాంగ్రెస్ వర్గాల్లో 'ట్రబుల్ షూటర్' గా గుర్తింపు ఉంది. సమస్యలు, సంక్షోభాలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరిస్తారని శివకుమార్ అధిష్ఠానం దృష్టిలో మంచి మార్కులు సంపాదించుకున్నారు.

ఆయనను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసినా, ఇదే అంశంలో పార్టీలోని కొందరు నేతలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించినా, కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆయన పనితీరు, సమర్థతను, ముఖ్యంగా పార్టీ పట్ల ఆయన విధేయతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పగ్గాలు అప్పగించింది.

More Telugu News