Corona Virus: కరోనా ఆరోగ్య బీమా పాలసీ.. ప్రీమియం ధరల విషయంలో బీమా సంస్థల సమాలోచనలు!

  • 'డిసీజ్‌ స్పెసిఫిక్‌'గా త్వరలో ప్రత్యేకంగా 2 రకాల పాలసీలు
  • బీమా సంస్థలన్నీ ఒకే ప్రామాణిక నిబంధనలతో రావాలని నిబంధన
  • జులై 10 తుది గడువు
  • కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పేరిట పాలసీలు
coronavirus insurance in india

ప్రజలు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీల్లో ఆయా సంస్థలు కరోనా చికిత్సకు కూడా పరిహారం ఇవ్వాలని ఐఆర్‌డీఏ ఆదేశించడంతో ప్రస్తుతం బీమా సంస్థలు కొవిడ్‌-19 ఉద్ధృతి నేపథ్యంలో  కొత్త పాలసీలతో ముందుకు రావాలని ప్రయత్నాలు జరుపుతున్నాయి.

భారత్‌లో కరోనా అంతగా ప్రభావం చూపని మొదటి రోజుల్లో తక్కువ ప్రీమియానికే కరోనా పాలసీలు ఇస్తామంటూ ప్రకటించిన కంపెనీలు.. కరోనా విజృంభణ అదుపుచేయలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో నష్టపోతామని భావిస్తూ ఇప్పుడు ఆ నిర్ణయంపై వెనకడుగు వేస్తున్నాయి.

'డిసీజ్‌ స్పెసిఫిక్‌'గా కొవిడ్‌-19 కోసం ప్రత్యేకంగా 2 రకాల పాలసీలను తీసుకురావాలని గత నెల నియంత్రణ సంస్థ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.  బీమా సంస్థలన్నీ ఒకే ప్రామాణిక నిబంధనలతో ఇందుకు సంబంధించిన పాలసీలను తీసుకురావాలని, చెబుతూ అందుకు గడువు కూడా విధించింది.

తొలుత జూన్‌ 15 వరకు పాలసీలను తీసుకురావాలని చెప్పి, ఆ తర్వాత బీమా సంస్థలు కోరిక మేరకు జులై 10కి పెంచింది. కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పేరిట ఈ పాలసీలు తీసుకురావాలని చెప్పింది. బీమా పాలసీలను రూపొందించి ఆయా రోగాలకు ప్రీమియం నిర్ణయించే సమయంలో బీమా కంపెనీలు ఆయా వ్యాధుల చికిత్సకు అయ్చే ఖర్చు, ఆ వ్యాధి విజృంభణ వంటి అంశాలను లెక్కగట్టుకుంటాయి.

ప్రీమియాన్ని నిర్ణయించే అధికారం బీమా సంస్థలకే ఉన్నప్పటికీ, దేశమంతటికీ ఒకే ప్రీమియం ఉండాలని ఐఆర్‌డీఏ ఆదేశించడంతో ఆ నిబంధనల ప్రకారం ప్రీమియం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. బీమా సంస్థలు ఇష్టం వచ్చినట్లు పాలసీలు తీసుకురాకుండా ఐఆర్‌డీఏ నిబంధనలు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.

అయితే, ప్రీమియం నిర్ణయించడానికి సమయం పొడిగించాలని పదే పదే అడుగుతూ దాన్ని తీసుకువచ్చే క్రమంలో బీమా సంస్థలు చాలా ఆలస్యం చేస్తున్నాయి. కరోనా వల్ల అనారోగ్యం ఎదురైతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ప్రజలందరూ భావిస్తున్నారు. దీంతో దీనికి బీమా చేయించుకోవాలని యోచిస్తున్నారు.

దీంతో ఇప్పటికే ఉన్న పలు పాలసీలను విక్రయించేందుకు కొన్ని నిబంధనలను సడలించేందుకు బీమా కంపెనీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. కరోనాకు ప్రైవేటులో ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు లక్షల్లో ఖర్చవుతుంది. అంతేగాక, కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వారికీ వచ్చే అవకాశం ఉంది.  

ఇప్పటికే పలు ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నవారికి కంపెనీలు హోం క్వారంటైన్‌ ఖర్చులను ఇవ్వట్లేదు. దేశంంలోని ఓ ప్రైవేటు బీమా సంస్థ హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స చేయించుకున్న వారికి కూడా పాలసీ వర్తింపచేస్తామని చెప్పినప్పటికీ కొన్ని నిబంధనలు పెట్టింది. అనేక కంపెనీలు ఆసుపత్రుల్లోని కరోనా రోగులకు అవసరమయ్యే పీపీఈ కిట్లు, ఇతర ఖర్చులను మినహాయిస్తున్నాయి.

కరోనా నుంచి కోలుకున్న అనంతరం రోగికి ఇతర అనారోగ్యాలేమైనా వస్తే బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు తిరస్కరించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల 10 నుంచి బీమా కంపెనీలు కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పేరిట బీమా తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ చెప్పినప్పటికీ కంపెనీలు ప్రీమియం చార్జీలను ఇప్పటికీ ప్రకటించలేదు.

అయితే, రూ.50,000 పాలసీకి రూ.750, రూ.5 లక్షల పాలసీకి రూ.4,500 ప్రీమియం విధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 10లోపు స్వల్పకాలిక కొవిడ్‌ స్టాండర్డ్‌ ఆరోగ్య బీమా (కరోనా కవచ్‌ పాలసీ)ని తీసుకురావాలని  ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.

ఈ  పాలసీ శ్రేణి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు ఉండనుంది. దీని కాల పరిమితి 3.5 నెలల నుండి 9.5 నెలల మధ్య వరకు బీమా చేసుకునే వారి ఆప్షన్‌ మేరకు ఉంటుంది. అయితే, ఇది కేవలం వ్యక్తిగత పాలసీ మాత్రమే.

ప్రీమియం చెల్లించిన వారికి కరోనా సోకి కనీసం 72 గంటలపాటు ఆసుపత్రిలో చేరితే బీమా కంపెనీ 100 శాతం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ క్లయిమ్‌ చేసుకుని కాలపరిమితి తీరగానే పాలసీ కాంట్రాక్టు ముగిసిపోతుంది. మళ్లీ రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉండకుండా నిబంధన ఉంది. ఒక వ్యక్తికి ఒక పాలసీ మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.

More Telugu News