Tarun Bhaskar: దర్శకుడు తరుణ్ భాస్కర్ కి ట్రోలింగ్.. పోలీసులకు ఫిర్యాదు!

  • 'కప్పేల' చిత్రంపై అభిప్రాయం చెప్పిన తరుణ్ 
  • అరవడాలు లేవంటూ చిత్రానికి ప్రశంస
  • ఓ హీరో అభిమానుల ట్రోలింగ్  
  • విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు
Tharun Bhaskar complained to police against trollers

ఒక సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించినందుకు 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ట్రోలింగుకి గురయ్యారు. ట్రోలింగ్ లో వాళ్లు వాడుతున్న భాషకు అప్సెట్ అయిన తరుణ్ ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ వివరాలలోకి వెళితే, ఇటీవల వచ్చిన 'కప్పేల' మలయాళ చిత్రాన్ని చూసిన తరుణ్ భాస్కర్ ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ, సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించారు. మన తెలుగు సినిమాలలో కనిపించే అనవసరమైన డ్రామా సన్నివేశాలు కానీ, గట్టిగా అరవడాలు కానీ, కమర్షియల్ మాస్ ఎలిమెంట్ కానీ లేవు.. సినిమా చక్కగా వుంది అంటూ ఆయన తన అభిప్రాయాన్ని అందులో చెప్పారు.

అయితే, ఈయన తమ హీరో సినిమాల గురించే ఇలా చెబుతున్నాడంటూ భావించి కొందరు ఈయనని ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఇలా అసభ్య పదజాలాన్ని వాడుతూ, దూషిస్తూ, ట్రోల్ చేయడం మంచిది కాదంటూ వారికి చెప్పినప్పటికీ, వారు వినలేదనీ, దాంతో వారిపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ తరుణ్ భాస్కర్ తన పోస్టులో వివరించారు. ట్రోలింగుకి పాల్పడుతున్న ఇద్దరి వివరాలు కూడా పోలీసులకు అందజేశానని ఆయన తెలిపారు.    

More Telugu News