Karnataka: గొర్రెలు, మేకలకు కరోనా టెస్టులు.. ఐసోలేషన్‌లో 50 జీవాలు

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న మేకలు, గొర్రెలు
  • కరోనా లక్షణాలు అయి ఉండకపోవచ్చంటున్న పశువైద్యులు
  • రిపోర్టుల కోసం ఎదురుచూపు
sheeps and goats under go for corona tests in tumukur

తాను పెంచుతున్న మేకలు, గొర్రెల్లో కొన్ని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వాటి యజమాని వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాడు. కాసేపటికే అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు మేకలు, గొర్రెలతోపాటు వాటి యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలోని చిక్కనాయకహల్లిలో నిన్న జరిగిందీ ఘటన.

గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించామని, 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. జీవాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంపై జిల్లా కమిషనర్ కె.రాకేశ్ కుమార్ విచారణ చేపట్టారు.

కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని కచ్చితంగా చెప్పలేమని పశువైద్యులు అంటున్నారు. మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని చెబుతున్నారు. జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్టు తెలిపారు. కాగా, గొర్రెల కాపరికి మాత్రం కరోనా పాజిటివ్ అని వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News