Tirupati: ఆమె ఆత్మహత్య చేసుకోబోతోంది.. వెళ్లి కాపాడాలంటూ సమాచారమిచ్చిన యువకుడు.. అప్పటికే ఉరేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని!

  • తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఘటన
  • తల్లిదండ్రులు, సోదరుడితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఉరేసుకున్న యువతి
  • చికిత్స పొందుతూ మృతి
Phd student suicide in tirupati sri venkateshwara college

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో రీసెర్చ్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా బిట్రకుంటకు చెందిన రైల్వే ఉద్యోగి సుధాకర్, ఖాజమ్మల కుమార్తె శ్యామల (24) కళాశాలలో పీహెచ్‌డీ చేస్తోంది. శుక్రవారం సాయంత్రం కళాశాల వ్యవసాయ క్షేత్రంలో పంట నమూనాలు సేకరించిన శ్యామల అనంతరం హాస్టల్‌కు చేరుకుని రాత్రి 8.40 గంటల సమయంలో తల్లిదండ్రులు, సోదరుడితో మాట్లాడింది. రెండు రోజుల్లో వచ్చి తనను తీసుకెళ్లాలని కోరింది. ఆ తర్వాత కూడా ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయింది.

ఆ తర్వాత కాసేపటికి శ్యామల స్నేహితురాలికి ఫోన్ చేసిన ఓ యువకుడు.. ఆమె ఆత్మహత్యకు యత్నిస్తోందని, వెళ్లి కాపాడాలని కోరాడు. దీంతో విద్యార్థులు పరుగు పరుగున హాస్టల్‌కు చేరుకున్నారు. అయితే, అప్పటికే శ్యామల ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తలుపులు పగలగొట్టి ఆమెను కిందికి దించిన విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. శ్యామల ఆత్మహత్య చేసుకోబోతోందని ఫోన్ చేసిన చెప్పిన యువకుడు గుంటూరులో ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు అతడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

More Telugu News