Raghurama Krishna Raju: జగన్ కు తెలియకుండానే విజయసాయిరెడ్డి ఆదేశాలు ఇస్తున్నారు.. కుట్ర జరుగుతోంది: ఢిల్లీ నుంచి రఘురామకృష్ణ రాజు తీవ్ర ఆరోపణలు

  • సోషల్ మీడియా, సామాజికవర్గానికి చెందిన గ్రూపుల్లో తప్పుడు  ప్రచారం చేయిస్తున్నారు
  • అవాస్తవాలను ప్రచారం చేయిస్తున్నారు
  • నాకు వ్యతిరేకంగా పార్టీ నేతలు మాట్లాడటానికి కూడా విజయసాయే కారణం
Vijayasai Reddy plotting conspiracy against me says Raghurama Krishna Raju

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాను ఉపయోగించుకుని తనపై విజయసాయిరెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్ ను తాను పల్లెత్తు మాట అనకపోయినా ఆయనకు అనుకూలమైన సోషల్ మీడియాలో, ఆయన సామాజికవర్గానికి చెందిన గ్రూపుల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. తప్పుడు వార్తలను వారే రాయించి... రఘురామకృష్ణ రాజుపై ఎలాంటి వార్తలు వస్తున్నాయో చూశారా? అంటూ వారే దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

తనకు సంబంధం లేని ఒక కేసును తనకు లింక్ చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. పార్టీ నుంచి తనను పంపించేసి... ఆ తర్వాత తానే స్వచ్ఛందంగా పార్టీ నుంచి వెళ్లిపోయానని చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. తనపై కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తనకు వ్యతిరేకంగా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడటానికి కూడా విజయసాయే కారణమని  చెప్పారు. జగన్ కు తెలియకుండానే... పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజయసాయి మెసేజ్ లు పంపుతున్నారని... ఏం చేయాలనే విషయాన్నిఆదేశిస్తున్నారని... ఇదే విషయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు తనతో చెప్పారంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు.

More Telugu News