Nirmala Sitharaman: మట్టితో తయారు చేసే వినాయకుడి విగ్రహాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా?: నిర్మలా సీతారామన్

  • అందుబాటులో లేని, అవసరమయ్యే ముడిసరుకుని దిగుమతి చేసుకోవచ్చు
  • వినాయక విగ్రహాలను కూడా తెప్పించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది
  • ఇలాంటి పరిస్థితులు మారాలి
Nirmala Sitharaman comments on China Imports

చైనా కుట్రలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ వస్తులను బహిష్కరించాలనే ఉద్యమం మన దేశంలో ఊపందుకుంటోంది. దీనికి సంబంధించిన క్యాంపెయిన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. మరోవైపు ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... చైనా నుంచి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదని... అయితే మన దేశంలో దొరికే వస్తువులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం గురించి తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మనకు అందుబాటులో లేని వస్తువులను, అవసరమయ్యే ముడిసరుకును దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదని నిర్మల చెప్పారు. కానీ మన దేశంలో తయారయ్యే వినాయకుడి విగ్రహాలు, అగరబత్తీలు ఇలాంటి వాటిని కూడా ఆ దేశం నుంచి తెప్పించుకోవాలా? అని ప్రశ్నించారు. మన దేశ ఉత్పత్తిని, ఉద్యోగావకాశాలను పెంచే ముడిసరుకును దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదని.. వాటిని కచ్చితంగా దిగుమతి చేసుకుంటామని చెప్పారు.

మనం మట్టితో తయారు చేసుకునే వినాయకుడి విగ్రహాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకు తలెత్తిందని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు మారాలని చెప్పారు. ఈ మార్పుతోనే మనం స్వయం సమృద్ధిని సాధించవచ్చని అన్నారు.

More Telugu News