Tellam Balaraju: గొడ్డుకారంతో భోజనం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు!

  • కరోనాతో ఉపాధి కోల్పోయిన గిరిజనులు
  • ఆకలి తీర్చేందుకు సాహసయాత్ర చేసిన తెల్లం బాలరాజు
  • నిత్యావసరాలు మోసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే
Telangana MLA Tellam Balaraju Tour to Forest

కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన గిరిజనుల ఆకలి తీర్చేందుకు బయలుదేరిన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎంతో శ్రమించి, వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుకుంటూ గిరిజన గ్రామాలకు చేరుకుని రూ. 75 లక్షల విలువైన నిత్యావసరాలను అందించారు. ఇందుకోసం ఆయన సాహసోపేతమైన పర్యటన చేశారు.

బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అడవుల్లో ఉన్న మోతుగూడేనికి ఆయన పలువురు అధికారులతో కలిసి వెళ్లారు. మొత్తం 150 కుటుంబాలకు ఆయన సాయం చేశారు. భుజాలపై నిత్యావసరాలను మోస్తూ, ఆయన కిలోమీటర్ల కొద్దీ నడవగా, ఆయన వెంట పీఓ, ఇతర ఆఫీసర్లు కూడా సరుకులు మోస్తూ వెళ్లారు. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరాన్ని వీరు నడిచారు.

ఇక, భోజన సమయం దాటుతున్న సమయానికి మోతుగూడెం చేరుకున్న బాలరాజు తదితరులు గ్రామానికి చెందిన గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమె తన ఇంట్లో ఉన్న గొడ్డుకారంతో వారికి భోజనం పెట్టింది. దాన్నే బాలరాజు తదితరులు భుజించారు. కష్టకాలంలో తమకు సాయం చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే, అధికారులను అభినందించిన ఆమె, పథకాలను ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందించడంతో తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొంది.
ఆపై గ్రామస్థులతో ముచ్చటించిన తెల్లం, ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో రహదారులు లేవని, కొంతమేరకు రోడ్డు నిర్మాణం జరిగినా, ప్రస్తుతం పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. తాను కూడా కొంతమేరకు టూ వీలర్ పైనా, మరికొంత దూరం నడిచి వచ్చానని చెప్పిన బాలరాజు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News