YSRCP: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్‌ నోటీసులు

  • పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ తీరు
  • ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా వ్యాఖ్యలు
  • వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు
  • వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు
ycp gives notice to raghurama krishnam raju

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొంత పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయన పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని తెలిపారు. రఘురామకృష్ణం రాజు సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అంతేకాకుండా, అనేక సందర్భాలలో ఆయన మీడియా ముందు పార్టీ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ పేర్కొంది.

More Telugu News