చైనా బలగాలను వెనక్కి పంపేందుకు సైనిక చర్య... పరిశీలిస్తున్న కేంద్రం
- ఇప్పటికీ వాస్తవాధీన రేఖ సమీపంలోనే ఉన్న చైనా బలగాలు
- గాల్వన్ లోయలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- కొన్ని మీటర్ల దూరంలోనే భారత్, చైనా బలగాలు
చైనా మెడలు వంచడానికి ఇదే సరైన సమయమని నిపుణులు పేర్కొంటున్న తరుణంలో, గల్వాన్ లోయ అంశంపై ఆ దేశాన్ని కాళ్ల బేరానికి తెచ్చేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా... ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం సైన్యానికి కట్టబెడుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని మీటర్ల దూరంలోనే ఇరుదేశాల బలగాలు మోహరించి ఉన్నాయని తెలుస్తోంది. అటు గస్తీ పోస్టు-14, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనికులు బలప్రదర్శనకు దిగడంతోపాటు ఫిరంగులు, యుద్ధ ట్యాంకులు పెద్ద సంఖ్యలో మోహరించినట్టు తెలుస్తోంది.