Pawan Kalyan: సరైన నిర్ణయం తీసుకున్నారు... ఏపీలో 'పది' పరీక్షల రద్దుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

  • ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
  • ప్రభుత్వాన్ని అభినందించిన పవన్ కల్యాణ్
  • సీఎం జగన్, ఆదిమూలపు సురేశ్ లకు ప్రశంసలు
Pawan Kalyan responds on AP government decision cancelled tenth class exams

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అటు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉండవని, ఇంటర్ లో ఫెయిలైన వారిని కూడా పాస్ చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తులను గౌరవించినందుకు ఏపీ సర్కారును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు.

నిత్యం వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఇంతకుముందు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఘోర తప్పిదంగా భావించారని, అయితే పరీక్షలు రద్దు చేస్తూ సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వేళ పరీక్షల నిర్వహణ ప్రమాదకరమని, నిపుణులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ ఏపీ ప్రభుత్వాన్ని కోరిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. లక్షలాది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దన్న తమ సూచనలపై సహేతుకంగా స్పందించారంటూ ఏపీ సీఎం జగన్ కు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు అభినందనలు తెలిపారు.

More Telugu News