మొత్తం 76 మంది భారత జవాన్లకు గాయాలు: ఆర్మీ

76 Indian Jawans Injured in Clash
  • సోమవారం సాయంత్రం నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తత
  • గాయపడిన వారంతా కోలుకుంటున్నారు
  • ఎవరూ చైనా కస్టడీలో లేరన్న సైన్యాధికారి
చైనా, భారత్ సరిహద్దుల్లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో, మొత్తం 76 మంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారని సైనిక వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో 18 మంది లేహ్ లో చికిత్స పొందుతున్నారని, వారంతా 15 రోజుల్లో తమ విధుల్లో చేరగలరని, మిగతా 56 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వీరు మరో వారంలో కోలుకుని విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు.

సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. భారత భూ భాగంలో చైనా సైనికులు వేసిన టెంట్ ను తొలగించే ప్రక్రియలో కల్నల్ బీకే సంతోష్ బాబు నేతృత్వంలోని టీమ్, వారితో తలబడిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పాయింట్-14 సమీపంలో జరిగిన ఈ ఘటనలో భారత జవాన్లపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేసిన చైనా సైనికులు, భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఇదే సమయంలో భారత జవాన్లు తీవ్రంగా స్పందించగా, సుమారు 45 మంది చైనా సైనికులు హతమైనట్టు తెలుస్తున్నా, చైనా ఇంకా అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.

చైనా పీపుల్స్ ఆర్మీ దాడి తరువాత కొందరు భారత సైనికులు అదృశ్యమయ్యారని, వారంతా చైనా కస్టడీలో ఉన్నారని వార్తలు రాగా, ఆర్మీ అధికారులు అటువంటిదేమీ లేదని, ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిలో భారత జవాన్లలో ఎవరూ కనిపించకుండా పోలేదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
India
China
Army
Border

More Telugu News