Andhra Pradesh: మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం: ఏపీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్

  • ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం
  • ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం
  • 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా లబ్ది
  • ఏపీ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం
Governer Speach at AP Assembly

ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నదని, ప్రజలకు మేలు కలిగేందుకు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలను ఇప్పటికే నెరవేర్చామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను నెరవేర్చామని, మరో 39 హామీలను పరిశీలిస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలోని 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా లబ్ది జరిగిందని, అందుకు రూ. 42 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గవర్నర్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరంతో పోలిస్తే తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందని, ఆరోగ్య శ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి రూ. 1,200 కోట్లకు పైగా సాయం చేశామని, వైఎస్ఆర్ ఆసరా కోసం రూ. 1,534 కోట్లు, కంటివెలుగు కోసం రూ. 53.85 కోట్లను కేటాయించామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం వద్దా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచి 541 సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు కిట్స్ అందించేందుకు రూ. 656 కోట్లను కేటాయించామని, ఈ పథకం ద్వారా 39.70 లక్షల మంది చదువుకునే పిల్లలకు లబ్ది చేకూరనుందని తెలిపారు.

45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూతనివ్వాలని తన ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో వారికి రూ. 75 వేల చొప్పున సాయం చేయనున్నామని గవర్నర్ వెల్లడించారు. అమ్మ ఒడి పథకం ద్వారా, పిల్లలను బడికి పంపిస్తున్న 42.33 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఇంతవరకూ రూ. 6,550 కోట్లను జమ చేశామని తెలియజేశారు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించామని ఆయన గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి రేటును సాధించామని అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.

2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్టు పనులకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని, ఇకపై ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుందని తెలియజేశారు. వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా వేల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరమే పూర్తవుతుందని, అవుకు రెండో సొరంగాన్ని, సంగం బ్యారేజ్, వంశధార, నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తి చేయనున్నామని వెల్లడించారు.

తన ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వమని, ఏ స్థాయిలోనైనా అవినీతిని సహించేది లేదని గవర్నర్ హెచ్చరించారు. పాలనలో పారదర్శకత కోసం స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇక్కడికి వచ్చే ప్రతి ఫిర్యాదుపైనా స్పందిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ నియంత్రణను అరికట్టడంలో ఏపీ ముందు నిలిచిందని, వైరస్ పరీక్షలు నిర్వహించడంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు నిలిచిందని, ఇప్పటికే 5.50 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, రికవరీల సంఖ్య పెరుగుతోందని, వైద్యులు కరోనా కట్టడికి ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు.

More Telugu News