Narendra Modi: సీఎంలతో ప్రధాని సమావేశం.. ఆ 15 మంది సీఎంల అభిప్రాయమే కీలకం!

  • నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సమావేశం
  • బుధవారం నాడు పెద్ద రాష్ట్రాల సీఎంలతో మీటింగ్
  • ఆ తరువాత నిర్ణయాలను ప్రకటించనున్న కేంద్రం
Tomorrows PM Video Conference Crucial

ప్రధాని నరేంద్ర మోదీ నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి, రేపు రాత్రి వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. మంగళవారం నాడు 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, బుధవారం నాడు మిగతా 15 రాష్ట్రాల సీఎంలతో ఆయన మాట్లాడనుండగా, బుధవారం నాటి సమావేశాలే దేశానికి అత్యంత కీలకమని తెలుస్తోంది.

ఎవరితో ఏ రోజు మాట్లాడాలన్న విషయమై ఎంతో ఆలోచించే నిర్ణయించారని పీఎంఓ వర్గాలు అంటున్నాయి. నేడు పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లడఖ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ హలేవీ అండ్ డామన్ డయ్యూ, సిక్కిం లక్షద్వీప్ సీఎంలతో మోదీ మాట్లాడనున్నారు.
ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అన్ని కరోనా కేసుల సంఖ్య, మొత్తం కేసుల్లో 20 శాతం కూడా లేవు. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య రెండంకెలను దాటలేదు. ఈ రాష్ట్రాల సీఎంలతో సమావేశం కేవలం నామమాత్రమేనని, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించే అభిప్రాయాలే కీలకమని పీఎంఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇక బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, మొత్తం కేసుల్లో 30 శాతానికి పైగా ఉన్న మహారాష్ట్ర, 15 శాతం ఉన్న తమిళనాడుతో పాటు, వేల సంఖ్యలో కేసులు వచ్చిన ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్, తెలంగాణ, ఒడిశా సీఎంలతో మాట్లాడనున్నారు. ఇండియాలోని కేసుల్లో 80 శాతానికి పైగా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

వాస్తవానికి భారత ఆర్థిక వృద్ధిలో ఈ రాష్ట్రాలు అత్యంత కీలకం. ఈ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై తనకున్న సందేహాలను అడిగి తెలుసుకున్న తరువాత మోదీ, తన నిర్ణయాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News