Tenent: ఇంటి అద్దె విషయమై వాగ్వివాదం... తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపిన యజమాని... వీడియో ఇదిగో!

  • లాక్ డౌన్ లో జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు
  • అద్దె విషయంలో యజమానికి, కిరాయిదారుకు గొడవ
  • వైరల్ అవుతున్న వీడియో
Gun Fire on Tenent in Karnataka Over Rent Due

లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా జీతాలు రావడం లేదని, తాను అద్దెను కట్టలేనని చెప్పిన ఓ కిరాయిదారుతో జరిగిన వాగ్వివాదం తుపాకి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. బెంగళూరుకు దాదాపు 572 కిలోమీటర్ల దూరంలోని బెళగావి జిల్లాలోని చికోడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన 9 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, ఓ ఇంట్లో అద్దెకున్న కిరాయిదారు శ్రీమంత్ దీక్షిత్, మార్చి నుంచి అద్దెను చెల్లించలేదు. దీంతో ఇంటి యజమాని కుమారుడు వచ్చి, ఇంటికి కరెంట్ ను కట్ చేసి వెళ్లాడు. ఇదే కిరాయిదారు, యజమాని షా మధ్య వివాదానికి కారణమైంది. ఇద్దరి మధ్యా వాదనలో తొలుత కిరాయిదారు, ఓ పదునైన ఆయుధంతో దాడికి దిగగా, యజమాని చేతికి గాయమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను, తన లైసెన్డ్స్ గన్ ను తెచ్చి, కిరాయిదారుని బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు.

ఇంటి అద్దె అడ్వాన్స్ నిమిత్తం ఇచ్చిన రెండు నెలల అద్దెను చెల్లుబెట్టుకుని, మరో నెల అద్దె కట్టేసి ఇల్లు ఖాళీ చేయాలని షా కోరగా, అందుకు దీక్షిత్ అంగీకరించలేదు. లాక్ డౌన్ కారణంగా తాను పని కోల్పోయి ఉంటే, అద్దె అడుగుతున్నాడని అతను ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో రెండు కుటుంబాలూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టడంతో, పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News