అచ్చెన్నకు శస్త్రచికిత్స జరిగి రెండ్రోజులే అయింది... బలవంతంగా తీసుకెళతారా?: చంద్రబాబు ఫైర్
- అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన ఏసీబీ
- ఏంటి అచ్చెన్నాయుడు చేసిన నేరం అంటూ చంద్రబాబు ఆగ్రహం
- ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపాటు
మీ కక్ష సాధింపు చర్యలకు అంతులేదా అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. "మీరు విచారణకు పిలిస్తే రానన్నాడా, మీరు నోటీసులిస్తే స్పందించలేదా, ఏంటి అచ్చెన్నాయుడు చేసిన నేరం? మీకు అధికారం ఉంది కదా అని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఆటలు సాగుతాయనుకుంటున్నారా?" అంటూ నిప్పులు చెరిగారు.
అచ్చెన్నాయుడుపై ఆరోపణలన్నీ కల్పితాలేనని అన్నారు. విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్న పేరు లేదని, ఐఎంఎస్ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్ , విజయ్ ల పేర్లు మాత్రమే రిపోర్టులో ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. మరీ దుర్మార్గంగా అచ్చెన్న ఇంటికి వెళ్లి, అరెస్ట్ గురించి చేతితో రాసిస్తారా? అంటూ మండిపడ్డారు. అచ్చెన్న అరెస్ట్ విషయాన్ని వైసీపీ వాళ్లు ఒకరోజు ముందే సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయగలిగారంటూ నిలదీశారు.