Sun: రాజస్థాన్ లో 'చుర్'మంటున్న ఎండ.. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరిక!

  • మండుతున్న రాజస్థాన్ లోని చురు 
  • 2016 తరువాత 50 డిగ్రీల వేడిమి నమోదు
  • పలు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
Churu Heat Reached 50 Degrees

భానుడు చండ ప్రచండ నిప్పులను కురిపిస్తున్న వేళ, గడచిన 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వేడిమి నమోదైన ప్రాంతాల్లో 10 ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి. వెదర్ మానిటరింగ్ వెబ్ సైట్ 'ఎల్ డొరాడో' వెల్లడించిన వివరాల ప్రకారం, రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురులో మంగళవారం నాడు 50 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైంది. థార్ ఎడారికి ముఖద్వారంగా చెప్పుకునే చూరు ప్రాంతంలో ప్రతి సంవత్సరమూ రికార్డు స్థాయిలో వేడిమి నమోదవుతూ ఉంటుంది.

మంగళవారం నాడు ప్రపంచంలోనే హాటెస్ట్ ప్లేస్ గా అభివర్ణించే పాకిస్థాన్ లోని జకోబాబాద్ లో నమోదైన వేడిమికి సమానంగా చురు లో ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. చురుతో పాటు రాజస్థాన్ లోని బికనీర్, గంగా నగర్, పిలని పట్టణాల్లోనూ, ఉత్తర ప్రదేశ్ లోని బందా, హిస్సార్, మహారాష్ట్ర, హర్యానాలోనూ గరిష్ఠ వేడిమి నమోదైంది.

న్యూఢిల్లీలో 47.6 డిగ్రీలు, బికనీర్ లో 47.4, గంగానగర్ లో 47, ఝాన్సీలో 47, పిలనిలో 46.9, నాగపూర్ లో 46.8, అకోలాలో 46.5 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైందని అధికారులు వెల్లడించారు. 2016, మే 19న 50.2 డిగ్రీలుగా నమోదైన చురు ఉష్ణోగ్రత, తిరిగి అదే స్థాయికి చేరడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ అధికారులు వెల్లడించారు.

More Telugu News