Union Minister: నా శాఖ అత్యవసర సేవల పరిధిలో ఉంది.. నాకు నిబంధనలు వర్తించవంతే!: కేంద్రమంత్రి

  • ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు సదానందగౌడ
  • క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించి నేరుగా ఇంటికి
  • తనకు ఎటువంటి సమస్య లేకపోవడంతోనే ఇంటికి వెళ్లానని వివరణ
Union Minister Sadananda Gowda skips quarantine

తనకు క్వారంటైన్ నిబంధనలు వర్తించవంటూ కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నిన్నటి నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కావడంతో మంత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపాలన్న నిబంధన ఉన్నప్పటికీ మంత్రి మాత్రం నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి స్పందించారు.

తాను నిర్వహించే శాఖ అత్యవసర సేవల పరిధిలో ఉందని, కాబట్టి తనకు క్వారంటైన్ నిబంధనలు వర్తించవని వివరణ ఇచ్చారు. ఔషధాల పంపిణీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాలతో సకాలంలో చర్చించాల్సిన బాధ్యత తనపై ఉందన్న మంత్రి సదానందగౌడ.. తన వద్ద ఆరోగ్యసేతు యాప్ ఉందని, వైద్య పరీక్షలు నిత్యం చేయించుకుంటున్నానని తెలిపారు. తనకు ఎటువంటి సమస్యలు లేవని, అన్నీ సరిగా ఉండడంతోనే తాను ప్రత్యేక విమానంలో బెంగళూరు వచ్చానని మంత్రి వివరించారు.

More Telugu News