america: భారత్‌పై చైనా కుట్రలు.. కవ్వింపులు!: అమెరికా నివేదికలో వెల్లడి

  • భారత్‌తో పాటు తమ పొరుగు దేశాలతో చైనా కవ్వింపు చర్యలు
  • సరిహద్దుల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోంది
  • బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు ఆజ్యం పోస్తోంది 
  • చైనా మాటలు ఒకలా ఉంటే, చేతలు మరోలా ఉన్నాయి
america on china

భారత్‌తో పాటు పలు దేశాలపై చైనా చేస్తున్న కుట్రలను అమెరికా వెల్లడించింది. ఈమేరకు వైట్ హౌస్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. భారత్‌తో పాటు తమ పొరుగు దేశాలతో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పింది. దేశాల సరిహద్దుల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోందని అమెరికా నేత ఒకరు ప్రకటించిన నేపథ్యంలో శ్వేతసౌధం ఇదే విషయంపై తమ నివేదికలోనూ ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం.

బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు ఆజ్యం పోస్తోందని అమెరికా పేర్కొంది. భారత్‌-చైనా సరిహద్దు విషయంతో పాటు దక్షిణ చైనా సముద్రం, ఎల్లో సీ, తైవాన్‌ జలసంధి అంశాల్లో చైనా మాటలు ఒకలా ఉంటే, చేతలు మరోలా ఉన్నాయని పేర్కొంది. చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పింది.

తమ దేశం ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ నేత బెదిరింపులు ఎక్కువవుతున్నాయని తెలిపింది. తన ప్రయోజనాలకు, లక్ష్యాలకు అడ్డొచ్చే వారిని చైనా బెదిరించే ప్రయత్నం చేస్తోందని చెప్పింది. ప్రపంచ సమాచార సాంకేతికత వ్యవస్థను కొల్లగొట్టాలని చూస్తోందని పేర్కొంది.

ఇప్పటికే జాతీయ సైబర్‌ భద్రత చట్టం ద్వారా సమాచార స్థానికీకరణను చైనా తప్పనిసరి చేసిందని, ఇతర దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటోందని తెలిపింది. చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని పలు దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరముందని తెలిపింది. వ్యూహాత్మక విధానం ద్వారా ఆయా దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని శ్వేతసౌధం చెప్పింది.

More Telugu News