Hyderabad: మందు కొట్టి బిచ్చమెత్తిన ఇద్దరు మహిళలు... సికింద్రాబాద్ లో హల్ చల్!

  • సికింద్రాబాద్, పాస్ పోర్టు కార్యాలయం ఎదురుగా ఘటన
  • రూ. 10 అడిగితే ఇవ్వలేదని కారుపై దాడి
  • ఏమీ చేయలేక వదిలేసిన పోలీసులు

జంట నగరాల పరిధిలోని సికింద్రాబాద్, పాస్ పోర్టు కార్యాలయం ఎదురుగా ఇద్దరు మహిళలు మందు కొట్టి హల్ చల్ చేశారు. వారిని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ఇక్కడి సాగర్ హోమియో స్టోర్ దగ్గర మందుల కోసం తన కారును పార్క్ చేసిన ఓ వ్యక్తి, లోనికి వెళ్లి వచ్చేసరికి ఇద్దరు మహిళలు పూటుగా గుడుంబా తాగి, కారు వద్ద నిలుచున్నారు.

ఆపై తమకు పది రూపాయలు ఇవ్వాలని కారు యజమానిని డిమాండ్ చేశారు. తన వద్ద చిల్లర లేదని చెప్పగానే, చెయ్యి పట్టుకుని వేధించావంటూ హంగామా మొదలు పెట్టారు. నలుగురూ వచ్చి చేరేలోపే, కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయానికి అక్కడకు చేరుకున్న మార్కెట్ పోలీసులు, మహిళలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి, తమ వల్ల కాక, ఆ ప్రాంతం తమ పరిధిలోనిది కాదని తప్పించుకుని వెళ్లిపోయారు. ఆపై జరుగుతున్న హంగామాను ఎవరో పోలీసులకు చేరవేయగా, గోపాలపురం పోలీసులు వచ్చారు.

వారు సైతం మహిళలను అదుపులోకి తీసుకోకుండా, వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కారు యజమానికి సైతం సర్దిచెప్పి వెళ్లిపోవాలని కోరారు. కారు యజమానిపై దాడి చేయడమే కాకుండా, నానాయాగీ చేసిన వారిని పోలీసులు ఊరికనే వదిలేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

More Telugu News