India: కరోనాపై విజయం దిశగా... ఒక్కరోజులో పంజాబ్ లో952, తమిళనాడులో 939 మంది డిశ్చార్జ్!

  • ఇండియాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • ఇదే సమయంలో పెరుగుతున్న రికవరీలు
  • కోలుకున్నవారికి విందు ఏర్పాటు చేసిన పంజాబ్ ఎమ్మెల్యే
Nearly 1900 Corona Patients Discharged in Punjab and Tamilnadu

ఇండియాలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉన్నప్పటికీ, డిశ్చార్జ్ కేసుల సంఖ్యా పెరుగుతూనే ఉండటం కొంత ఆశాజనకంగా ఉంది. కరోనాపై విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయనడానికి సంకేతంగా, రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో రికవరీ వేగవంతమైంది. శనివారం ఒక్క రోజులో పంజాబ్ లో వివిధ ఆసుపత్రుల నుంచి 952 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. కోలుకున్న వారందరికీ కపుర్తలా ఎంఎల్ఏ రానా గురుజిత్ సింగ్ విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 657 యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు.

ఇక తమిళనాడు విషయానికి వస్తే, కొత్తగా 477 కేసులు నమోదు కాగా, శనివారం నాడు 939 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంతవరకూ 10,585 కేసులు నమోదు కాగా, 3,538 మంది రికవరీ అయ్యారు. మరో 6,970 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 74 మంది మరణించారు. కొత్త కేసుల్లో ఒక్క చెన్నైలోనే 332 కేసులు రాగా, తిరువళ్లూరు జిల్లాలో 10, చంగల్పేటలో 13, కాంచీపురంలో 4 కేసులు వచ్చాయి. వీరిలో కొందరు ఢాకా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులని అధికారులు తెలిపారు.

More Telugu News