Gutta Sukhender Reddy: చట్టానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గుత్తా సుఖేందర్

  • 203 జీవోతో కృష్ణా ఆయకట్టు ఎడారిగా మారుతుంది
  • కేసీఆర్ ఉన్నంత వరకు ఒక్క చుక్కను కూడా అక్రమంగా తరలించలేరు
  • పోతిరెడ్డిపాడును ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలపై ఉంది
Jagan acting against law says Gutta Sukhender Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 203తో కృష్ణా ఆయకట్టు ఎడారిగా మారుతుందని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఒక్క చుక్క కృష్ణా నీటిని కూడా అక్రమంగా తరలించలేరని చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే కృష్ణా నది కింద ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని చెప్పారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ప్రస్తుత నల్గొండ, భువనగిరి ఎంపీలు (కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి) గతంలో సమర్థించారని... ఈ విషయాన్ని ఇప్పుడు వారు గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించుకోవాలని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు గతంలో నీరు వెళ్లినప్పుడు ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణ హారతులు పట్టారని విమర్శించారు.

ఉమ్మడి ఏపీకి రాయలసీమ నేతలే ముఖ్యమంత్రులుగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని గుత్తా అన్నారు. పోతిరెడ్డిపాడును ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News