India: కరోనా కేసుల్లో చైనా దరికి భారత్!

  • 11వ స్థానంలో చైనా, 12వ స్థానంలో భారత్
  • భారత్‌లో స్థిరంగా మరణాల రేటు
  • భారత్‌తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా చైనాలో రికవరీ రేటు
Indian now in 12th place in corona cases

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రపంచ జాబితాలో భారతదేశ స్థానం ఎగబాకుతోంది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 82,900కుపైగా కేసులతో చైనా 11వ  స్థానంలో ఉండగా, నిన్నటి గణాంకాల ప్రకారం 70,756 కేసులతో భారత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది.

గత నెల రోజులుగా దేశంలో మరణాల రేటు 3.23 దగ్గర స్థిరంగా ఉన్నప్పటికీ విపరీతంగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రికవరీ రేటు మాత్రం గణనీయంగా పెరిగింది. 9.05 శాతం నుంచి ఏకంగా 31.73కు పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. దీంతోపాటు గత 24 గంటల్లో 24 రాష్ట్రాల్లో మరణాలు సంభవించకపోవడం, 10 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

అలాగే, 9 రాష్ట్రాల్లో మరణాలు సంభవించగా, అందులో 64 శాతం మహారాష్ట్ర, గుజరాత్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి 28 వేలకు చేరుకోవడానికి 83 రోజులు పట్టగా, గత 8 రోజుల్లో దాదాపు అన్నే కేసులు నమోదయ్యాయి. చైనాతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ, రికవరీ రేటు మాత్రం భారత్ కంటే చైనాలో మూడు రెట్లు ఎక్కువగా అంటే 94.27 శాతంగా ఉంది.

More Telugu News