INS Jalashwa: 698 మందితో మాల్దీవుల నుంచి కొచ్చి చేరుకున్న భారీ నౌక

INS Jalashwa from Maldives has arrived Kochi on Sunday
  • విదేశాల్లోని భారతీయులను తీసుకువస్తున్న కేంద్రం
  • శుక్రవారం రాత్రి మాల్దీవుల నుంచి బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ
  • తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా రాక
వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో ఉన్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దేశాల నుంచి విమానాల్లో భారతీయులు సొంతగడ్డపై అడుగుపెడుతున్నారు. తాజాగా,  మాల్దీవుల నుంచి 698 మంది భారతీయులతో నేవీకి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ అనే నౌక కొచ్చి పోర్టుకు చేరుకుంది. ఈ నౌక మాల్దీవుల నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరింది.

మాల్దీవుల నుంచి వచ్చినవారిలో అత్యధికులు కేరళీయులే. కేరళకు చెందినవారు 440 మంది కాగా, తమిళనాడుకు చెందినవారు 110, కర్ణాటకకు చెందినవారు 45 మంది ఉన్నారు. ఇక, ఏపీకి చెందిన 8 మంది, తెలంగాణకు చెందిన 9 మంది కూడా మాల్దీవుల నుంచి కొచ్చి వచ్చిన వారిలో ఉన్నారు. కాగా, ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్టు ప్రయాణికులు తెలిపారు.

కాగా, మాల్దీవుల్లో మిగిలున్న 202 మంది భారతీయులతో మరో నౌక ఐఎన్ఎస్ మగర్ కూడా బయల్దేరినట్టు తెలుస్తోంది.
INS Jalashwa
Kochi
Maldives
Vande Bharat
Lockdown
Corona Virus
India

More Telugu News