Kishan Reddy: రాష్ట్రాలతో చర్చించి.. ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించాం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

  • యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతాం
  • ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దు
  • 80 జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
  • రాష్ట్రాల ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగింపు
kishan reddy on corona virus lockdown

యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైల్వే స్టేషన్లలో రైల్వే టిక్కెట్లు అమ్మబోరని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయన సూచించారు.

విద్యార్థులు, యాత్రికులు, కూలీలు వంటి వారికి ప్రత్యేకంగా అధికారులు ప్రయాణం చేసే అవకాశాలు కల్పిస్తున్నారని కిషన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత కూలీలు పనిచేస్తోన్న సంస్థలు రైల్వే టిక్కెట్లు ముందుగానే కొనాల్సి ఉంటుందని తెలిపారు.  

దేశంలోని 80 జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిషన్‌ రెడ్డి తెలిపారు. అలాగే, 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదని అన్నారు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలు, ఆయా ప్రాంతాల్లోని కరోనా కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించినట్లు చెప్పారు.

పలు రాష్ట్రాలతో చర్చించి, ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించామని చెప్పారు. రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం కరోనాపై పోరాడుతుందని తెలిపారు. కట్టడి ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలని చెప్పారు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశామని చెప్పారు.

More Telugu News