Chandrababu: క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలి: చంద్రబాబునాయుడు

  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
  • గతంలో అనేక విపత్తులలో ప్రజలకు వెన్నంటి నిలిచాం
  • అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పని చేశాం
Chandrababu Naidu Video Conference

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో అనేక విపత్తులలో ప్రజలకు వెన్నంటి నిలిచామని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పని చేశామని అన్నారు. ఇప్పుడీ ‘కరోనా’ విపత్తులో కూడా బాధితులకు అండగా ఉండాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలని, పేదలు, కార్మికులు, పంట దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించినట్టు సమాచారం.

ప్రభుత్వానికి తాము రాసిన లేఖల ద్వారా కొన్ని వర్గాలకు మేలు జరిగిందని, విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. అరువుపై ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులకు కల్పించిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నుంచి విశాఖలోనే 32 వేల మంది రైతుల పేర్లు తీసేశారని, అదే, రాష్ట్ర వ్యాప్తంగా అయితే నాలుగు లక్షల పేర్లు తొలగించారని విమర్శించారు.

More Telugu News