Simhachalam: అక్షయ తృతీయ రోజున ఏవి దానం చేయాలి? ఏ దైవాన్ని స్మరించాలి?

  • సింహాద్రి అప్పన్న మూర్తి వెలుగు చూసిన రోజు 
  • స్వామివారి నిజరూప దర్శనం లభించే రోజు
  • నవనిధులకు అధిపతి పదవిని కుభేరుడు పొందిన రోజు    
  • లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన విశేష ఫలితం

Simhachala ksheram

వైశాఖ శుక్ల తదియను అక్షయ తృతీయ అని అంటారు. అక్షయము అంటే క్షయము కానటువంటిది .. ఎప్పటికీ నశించనిది అని అర్థం. అందువలన ఈ రోజున దానధర్మాలు .. పుణ్యకార్యాలు చేయాలని అంటారు. అలా చేయడం వలన వచ్చే పుణ్య ఫలితం జన్మజన్మల పాటు వెంట వస్తూ ఉంటుందని విశ్వసిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రోజున ఉసిరికాయంత దానం చేస్తే గుమ్మడికాయంత ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. 

సాధారణంగా అక్షయ తృతీయ రోజు సమయానికి ఎండలు తీవ్రంగా ఉంటాయి. అందువలన మంచినీటి పాత్రలను దానం చేయాలి. లేదంటే చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తులకు మంచినీటిని .. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించాలి. లేదంటే ఆలయాలను దర్శించి అక్కడి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. ఇలా చేయడం వలన జీవుడు తరువాత జన్మలో ఏ శరీరాన్ని ధరించినా అన్నపానీయాలకు ఇబ్బంది పడటం జరగదు. 

అక్షయ తృతీయ రోజున ఎవరిని పూజించాలి? అనే ఒక సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ రోజునే అమ్మవారు కుభేరుడికి సంపదలను అనుగ్రహించింది. కుభేరుడిని నవనిధులు నాయకుడిగా పరమశివుడు ప్రకటించింది ఈ రోజునే. అందువలన ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా పోతాయి. 

ఇక ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ నృసింహస్వామిగా ఆవిర్భవించిన శ్రీమహావిష్ణువు, ఆ తరువాత కాలంలో పురూరవ చక్రవర్తి కారణంగా వెలుగు చూసిన రోజు అక్షయ తృతీయ. అందువల్లనే ఈ రోజున స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. ఆ తరువాత నుంచి స్వామివారికి ఆయా విశేషమైన రోజులలో చందనాన్ని అద్దుతూ వెళతారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించలేనివారు మనసులో స్వామి రూపాన్ని ధ్యానించడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది.

  • Loading...

More Telugu News