Kim Jong Un: కిమ్ మరణంపై వైరల్ అవుతున్న ఫేక్ ఫొటో... బతికున్నాడని నిరూపించేందుకు కొరియా ఆరాటం!

  • గత కొన్నిరోజులుగా కిమ్ ఆరోగ్యంపై తీవ్ర అనిశ్చితి
  • గాజు శవపేటికలో కిమ్ ఉన్నట్టు ఫేక్ ఫొటో
  • కిమ్ తండ్రి ఫొటోను మార్ఫింగ్ చేసినట్టు అనుమానాలు
Kim Jong un fake photo gone viral

ప్రపంచంలో ఇప్పుడు రెండే అంశాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకటి కరోనా, రెండు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి! కొన్నిరోజుల కిందట కిమ్ ఆరోగ్యం విషమించిందని, ఓ హార్ట్ సర్జరీ అనంతరం ఆయన కోలుకోలేకపోయారని కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వార్తా సంస్థ సీఎన్ఎన్ ఈ కథనాలు ప్రసారం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఉత్తర కొరియా పక్కనే ఉన్న దక్షిణ కొరియా ఈ కథనాలను తీసిపారేసింది. అయితే, తాజాగా కిమ్ గాజు శవపేటికలో ఉన్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కిమ్ తలకింద ఓ తెల్లని తలగడ, దేహంపై ఎర్రని వస్త్రం కప్పి ఉన్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తోంది. అయితే ఇది ఫేక్ ఫొటో అని తేటతెల్లమైంది. 2011లో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హార్ట్ అటాక్ తో మరణించినప్పటి ఫొటోను మార్ఫింగ్ చేసినట్టు భావిస్తున్నారు. కిమ్ గురించి 2017లోనూ ఇలాంటి ఫొటోలే వైరల్ అయ్యాయి. కాగా, ఇప్పుడు కిమ్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు, కథనాలు, మార్ఫింగ్ ఫొటోలకు తెరపడాలంటే కిమ్ బతికున్నట్టు ఏదైనా స్పష్టమైన ఆధారం చూపించక తప్పని పరిస్థితుల్లో ఉత్తర కొరియా ఉంది.

కిమ్ కు ఏమీ కాలేదన్న సంకేతాలను ఉత్తర కొరియా పంపిస్తున్నా, కథనాలను కొట్టిపారేసేటంతటి స్థాయిలో ఆ సంకేతాలు లేవని చెప్పాలి. చివరిసారిగా కిమ్ కనిపించింది ఏప్రిల్ 11న జరిగిన ఓ కార్యక్రమంలో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆచూకీ లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. కిమ్ బహిరంగంగా దర్శనమిస్తే తప్ప ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడంలేదు.

More Telugu News