RJ Samrat Jadugar: లాక్ డౌన్ కారణంగా ఉపాధి పోవడంతో కూరగాయలు విక్రయిస్తున్న ప్రముఖ ఇంద్రజాలికుడు

  • కూరగాయల విక్రేతగా మారిన సామ్రాట్ జాదూగర్
  • కుటుంబ పోషణకు తప్పడంలేదని వెల్లడి
  • ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖ మెజీషియన్ గా గుర్తింపు
Famous magician becomes vegetables seller

కరోనా రక్కసి కారణంగా భారత్ లో జనజీవనం స్తంభించిపోయింది. దాంతో అనేకమంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రాజస్థాన్ లో ప్రముఖ మెజీషియన్ గా పేరుగాంచిన రాజు మహోర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 38 ఏళ్ల రాజు మహోర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్జే సామ్రాట్ జాదూగర్ అనే పేరుతో ఎంతో ప్రసిద్ధుడు. 15 ఏళ్లుగా ఇంద్రజాలం ప్రోగ్రాములు ఇస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

ముఖ్యంగా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో మ్యాజిక్ షోలు నిర్వహించాడు. రోజుకు 10 వరకు షోలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో సామ్రాట్ జాదూగర్ పని లేకుండా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతని వద్ద పనిచేసే 12 మందికి కూడా ఉపాధి పోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సామ్రాట్ జాదూగర్ ధోల్ పూర్ జిల్లాలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఇంటి అద్దె కట్టాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా డబ్బు తప్పనిసరి అని, కూరగాయలు అమ్ముకోవడం తప్ప తనకు మరో ఆలోచన రాలేదని సామ్రాట్ జాదూగర్ తెలిపాడు.

More Telugu News