ముంబైలో వరుడు.. బరేలీలో వధువు.. ‘జూమ్’లో ఒక్కటైన జంట!
- డిజిటల్ వివాహం జరిపించిన షాదీ డాట్ కామ్
- ఆన్లైన్లోనే కన్యాదానం చేసిన వధువు తండ్రి
- రాయ్పూర్ నుంచి మంత్రాలు చదివిన పురోహితుడు
వివరాల్లోకి వెళ్తే.. సుషేన్ దంగ్ (26), కీర్తి నారంగ్ల పెళ్లి గతంలోనే నిశ్చయమైంది. ఇద్దరూ ఘనంగా పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా వారి ఆశ తీరే మార్గం లేకుండా పోయింది. అంతమాత్రాన పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేని ఇరువురు వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘జూమ్’ను ఎంచుకున్నారు.
సుషేన్ ముంబైలో సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి కొడుకులా ముస్తాబుకాగా, బరేలీలోని వధువు పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఆమె తండ్రి ఆన్లైన్లోనే సుషేన్కు కన్యాదానం చేశారు. రాయ్పూర్కు చెందిన పురోహితుడు అక్కడి నుంచే ఆన్లైన్లో మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు కానిచ్చేశాడు. ఈ పెళ్లికి బంధువులు కూడా భారీగా హాజరయ్యారు. అయితే నేరుగా మాత్రం కాదండోయ్.. వారివారి ఇళ్లలో ఉండే ఆన్లైన్లోనే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే పలు డిజిటల్ వివాహాలు జరిపించిన షాదీ డాట్ కామ్ అనే సంస్థే ఈ పెళ్లిని కూడా జరిపించింది. ఆన్లైన్ పెళ్లిళ్ల వల్ల సంప్రదాయ వివాహాలు కనుమరుగవుతాయన్న వాదనలో పసలేదని ఆ సంస్థ సీఈవో అనుపమ్ మిట్టల్ అన్నారు.