Roja: వాళ్లు పూలు చల్లుతారని నాకు తెలియదు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • పుత్తూరులో మంచినీటి బోర్ ప్రారంభోత్సవం 3 రోజుల కిందట జరిగింది
  • ఆరోజున ప్రారంభోత్సవానికి నేను రానని చెప్పాను
  • ప్రజల బలవంతంతో వెళ్లాల్సి వచ్చింది
YSRCP Mla Roja statement

చిత్తూరు జిల్లా పుత్తూరులోని సుందరయ్యనగర్ లో మంచినీటి బోర్ ను ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై రోజా స్పందిస్తూ, ఈ కార్యక్రమం మూడు రోజుల కిందట జరిగిందని, ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రసారం చేయకుండా, టీడీపీ నాయకులకు, పచ్చ ఛానెళ్లకు కావాల్సిన భాగాన్ని ప్రసారం చేసుకుని తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

పచ్చ ఛానెళ్లలో తనపై డిస్కషన్ కూడా పెట్టారని, ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తనపై విమర్శలు చేశారని అన్నారు. టీడీపీ పాలనలో పుత్తూరును ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ రోజున ప్రారంభోత్సవానికి తాను రానని, అక్కడి ప్రజలనే ప్రారంభించాలని చెప్పినా వాళ్లు వినలేదని చెప్పారు. అక్కడికి నడిచి వెళుతుండగా వాళ్లు పూలు చల్లారని, ఆ విషయం తనకు గానీ, పోలీసులకు గాని తెలియదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి 35 రోజులుగా ఎంతో శ్రమిస్తున్నానని, ఈ మంచి విషయాలను చూపించని పచ్చ ఛానెళ్లు, ఈ రోజున పనిగట్టుకుని పూలుజల్లే వీడియోను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

More Telugu News