UP DOCTORS: ఫ్యాన్లు, టాయిలెట్లు పని చేయవు.. ప్లాస్టిక్‌ కవర్లో భోజనం: గోడు వెళ్లబోసుకున్న యూపీ వైద్యులు!

  • అర్ధరాత్రి వీడియో తీసి నెట్‌లో పెట్టిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది
  • కనీస సౌకర్యాలు లేని పాఠశాలలో తమకు క్వారంటైన్ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం
  • వెంటనే స్పందించిన ప్రభుత్వం.. అతిథి గృహానికి తరలింపు
Fans Toilets Dont Work UP Doctors Release Videos from their quarantine centre

తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా వైరస్‌  బాధితులకు చికిత్స అందిస్తున్న  వైద్యులు, వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా వారిపై దాడులు జరుగుతున్నాయి. వాటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. కానీ, నిరంతరం శ్రమిస్తున్న వైద్యులకు ప్రభుత్వాలు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్న విషయం బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బలేరి జిల్లాలో కొవిడ్19 రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఓ ప్రభుత్వ పాఠశాలలో ‘యాక్టివ్ క్వారంటైన్’ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పాఠశాల చాలా అధ్వానంగా ఉంది. ఫ్యాన్లు తిరగడం లేదు, టాయిలెట్లు పని చేయడం లేదు.. విశ్రాంతి తీసుకునే గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. దాంతో ఆ దుస్థితిని వీడియో తీసిన వైద్య సిబ్బంది నెట్‌లో పెట్టారు. జిల్లా ప్రధాన ఆరోగ్య అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన యూపీ ప్రభుత్వం.. సదరు వైద్య సిబ్బందిని ఈ పాఠశాల నుంచి ఓ అతిథి గృహానికి పంపించింది.

కరోనా రోగులకు చికిత్స చేయడం వల్ల ఇంటికి వెళ్లకుండా క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న తమకు ప్రభుత్వ అధికారులు కేటాయించిన కేంద్రంపై  వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ క్వార్టర్స్‌ ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతూ బుధవారం రాత్రి మూడు గంటల సమయంలో రెండు వీడియోలను విడుదల చేశారు.

‘ఇప్పుడు రాత్రి మూడు అవుతోంది. కరెంట్ లేదు. ఒకే గదిలో నాలుగు మంచాలు వేశారు. పేరుకు ఇది ఫైవ్ స్టార్ క్లాస్ కానీ, ఇక్కడ ఫ్యాన్ కూడా తిరగడం లేదు. కామన్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. టాయిలెట్స్‌ వద్ద నల్లాలు కూడా లేవు. అవి పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. యాక్టివ్‌ క్వారంటైన్‌లో మేం ఇలా ఉండాల్సి వస్తోంది’ అని వాటిని చూపిస్తూ  ఓ వైద్యుడు వీడియోలో వివరించాడు.  

తమకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారో మరో వీడియో ద్వారా తెలిపారు. ‘మధ్యాహ్న భోజనంగా మాకు ఇచ్చిన ఆహారం చూడండి. ప్లాస్టిక్ కవర్లో చుట్టుకొని తీసుకొచ్చారు. పూరీలు, కూరలు మొత్తం ఒకేదాన్లో వేశారు. కరోనా రోగులకు చికిత్స చేసే పనిలో ఉన్న వైద్యులకు, సిబ్బందికి ఇలాంటి ఆహారం ఇస్తున్నారు. మేం పడుకునేందుకు  ఓ పెద్ద క్లాస్‌ రూమ్‌లో నాలుగు బెడ్స్ వేశారు. రాత్రంతా కరెంట్ లేదు. 20 లీటర్ల వాటర్ బాటిల్ ఇచ్చి.. దాన్నే అందరూ తాగాలని చెప్పారు’ అని పేర్కొన్నారు.

ఇక వైద్య సిబ్బంది నుంచి ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే ... ఈ పాఠశాలను పరిశీలించినట్టు జిల్లా ప్రధాన వైద్య అధికారి తెలిపారు. అధికారులతో కలిసి వారిని దగ్గర్లోని అతిథి గృహానికి పంపించామన్నారు.

More Telugu News