Electricity Meter: కరెంట్ మీటర్ ఫొటో తీసి పంపితే బిల్... కొత్త యాప్ ను రెడీ చేస్తున్న తెలంగాణ!

  • ఈ నెలకు కరెంట్ రీడింగుల నమోదు వాయిదా 
  • వచ్చే నెలలో రీడింగ్ తీస్తే స్లాబ్ మారిపోయే అవకాశం
  • ప్రజలకు ఇబ్బంది కలుగకుండా యాప్ రూపొందిస్తున్న ఉత్తర డిస్కమ్
New App for Electric Bill In Telangana

లాక్ డౌన్ పటిష్ఠంగా అమలవుతున్న ఈ తరుణంలో కరెంట్ మీటర్ల రీడింగ్ నమోదును తెలంగాణ డిస్కమ్ లు వచ్చే నెలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో మీటర్ రీడింగ్ ను చూసే సమయానికి స్లాబ్ మారిపోయి, బిల్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి విరుగుడుగా, తెలంగాణ ఉత్తర డిస్కమ్ ఓ ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా మీటర్ రీడింగ్ ను ఫోటో తీసి పంపితే బిల్ జనరేట్ అవుతుందని డిస్కమ్ సీఎండీ అన్నమనేని గోపాలరావు వెల్లడించారు. వినియోగదారులు పాత బిల్ వచ్చిన తేదీ నుంచి సరిగ్గా 30 రోజులకు రీడింగ్ ను ఫొటో తీసి పంపితే బిల్ వస్తుందని, దాన్ని ఆన్ లైన్ లోనూ చెల్లించవచ్చని సూచించారు.

కాగా, ఢిల్లీలో ఈ తరహా విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఆన్ లైన్ లో మీటర్ ఫోటో తీసి 7వ తేదీలోగా దాన్ని పంపించి డబ్బులు చెల్లిస్తే, ఒక శాతం రాయితీని, 8 నుంచి 14 లోగా చెల్లిస్తే అర శాతం రాయితీని అందిస్తోంది కేజ్రీవాల్ సర్కారు. ఈ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని, కరెంట్ కనెక్షన్ నంబర్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసి కరెంట్ బిల్లులను పొందవచ్చు.

More Telugu News