Bandla Ganesh: తెలంగాణ నాయకుల్ని చూసి నేర్చుకోండి: ఏపీ నాయకులకు బండ్ల గణేశ్ సలహా

  • ప్రతి నెల ఎన్నికలు వస్తాయేమో అనే భయంలో ఏపీ నాయకులు ఉన్నట్టున్నారు
  • ఇది బతుకు పోరాట సమయం
  • రాజకీయాలను పక్కన పెట్టి.. ప్రజలను కాపాడండి
Bandla Ganesh fires on AP politicians

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి ప్రశంసలు కురిపించారు. 'మనమెవ్వరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శవంతంగా ఉన్నాం అనేదే ముఖ్యం' అని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ... 'నిజాయతీ మీ యశస్సు, నీతి మీ ఆయుష్షు... జై కేసీఆర్' అని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో ఏపీ రాజకీయ నాయకులపై బండ్ల గణేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీవీలు చూస్తుంటే ఏపీ రాజకీయ నాయకులు ప్రతి నెల ఎలక్షన్స్ వస్తాయేమో అనే భయంతో డిబేట్లలో పాల్గొంటున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయనే విషయాన్ని ఏపీ రాజకీయ నాయకులు, ప్రజలు గమనించాలని సూచించారు.

తెలంగాణ రాజకీయ నాయకులను చూసి కష్టకాలంలో ఎలా ఉండాలో నేర్చుకోండని బండ్ల గణేశ్ హితవు పలికారు. రాజకీయాలకు ఇది సమయం కాదని... ఇది బతుకు పోరాట సమయమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి, దేవుడి మీద ప్రమాణాలను పక్కన పెట్టి, ప్రజలను కాపాడాలని చెప్పారు.

More Telugu News