Telangana: కేంద్రం సడలించినా మేం ఎట్టిపరిస్థితుల్లో సడలింపు ఇవ్వట్లేదు: సీఎం కేసీఆర్

CM KCR said tight lock down will continue
షార్ట్స్‌లో చూడండి
కేంద్రం ప్రభుత్వం రేపటి నుంచి లాక్ డౌన్ లో పాక్షిక సడలింపులు ఇస్తున్నాగానీ, తెలంగాణలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సడలింపు ఇవ్వబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొన్ని విషయాల్లో సడలింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని, కానీ రాష్ట్రంలో పరిస్థితిపై తమ క్యాబినెట్ సుదీర్ఘ చర్చ జరిపిందని, ఏ విషయంలోనూ సడలింపు ఇవ్వరాదని నిర్ణయించామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైరస్ తీరుతెన్నులు, ఇతర స్థితిగతులు అన్నీ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని చెప్పారు.

తమకున్న సమాచారం ప్రకారం మే 1 నుంచి చాలావరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నామని తెలిపారు. ఇవాళ 450 వరకు టెస్టులు జరిపితే 18 మాత్రమే పాజిటివ్ వచ్చాయని, మే మొదటి వారం నుంచి కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోందని వివరించారు. కాగా, లాక్ డౌన్ సడలింపు మార్గదర్శకాల సందర్భంగా కేంద్రం ఓ విషయం స్పష్టం చేసిందని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా నివారణకు మరింత కఠినమైన చర్యలు తీసుకోదలిస్తే అందుకు అభ్యంతరం లేదని పేర్కొందని వివరించారు.

1897 అంటురోగాల చట్టం జీవో ప్రకారం కేంద్రానికి ఏవైతే అధికారాలు ఉంటాయో రాష్ట్రానికి కూడా అవే అధికారాలు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకున్నామని, లాక్ డౌన్ కఠిన అమలుకు తాజా ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా 18 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, ఇప్పటివరకు 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మృతుల సంఖ్య 21 అని వెల్లడించారు. ప్రస్తుతం 651 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 186 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఒక్క కేసు కూడా లేని జిల్లాలు రాష్ట్రంలో 4 ఉన్నాయని అన్నారు.
Go Back to Shorts
Telangana
Lockdown
Corona Virus
KCR

More Telugu News