Srikakulam District: వలస కూలీల సాహసం...చెన్నై నుంచి సముద్రమార్గంలో శ్రీకాకుళానికి!

  • ఒడ్డుకు చేరినా కరోనా భయంతో ఊర్లోకి రానివ్వకూడదని గ్రామస్థుల తీర్మానం
  • పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీరంలో నిఘా
  • ఇదివానిపాలెంలో ఒడ్డుకు చేరగానే అదుపులోకి తీసుకుని క్వారంటైన్  సెంటర్‌కి తరలింపు
Fishermet travel from chennai to srikakulam in boat

వారంతా వలస కూలీలు...పొట్ట చేత పట్టుకుని చెన్నై పట్టణానికి తరలిపోయారు. కూలోనాలో చేసి జీవనోపాధి పొందుతున్న వేళ ‘లాక్‌డౌన్‌’ వచ్చిపడింది. ఉన్నచోట పనిలేక, పట్టెడన్నం పెట్టే నాథుడు కరువై పస్తులతో కాలం గడపాల్సిన దుస్థితి. ఏదోలా సొంతూరికి చేరిపోతే...ఈ ఆలోచనే వారిని ప్రాణాలకు తెగించేలా చేసింది. రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం లేకపోవడంతో నాలుగు రోజులపాటు  సముద్ర ప్రయాణానికి  సాహసించారు. అష్టకష్టాలు పడి ఒడ్డుకు చేరినా సొంతూళ్ల వారే అడ్డుకోవడంతో వారి కథ మరో మలుపు తిరిగింది.

వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా కవిటి, సోంపేట మండలాలకు చెందిన పలువురు మత్స్యకారులు చెన్నైలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరు సొంతూర్లకు వెళ్లిపోవాలని సముద్రమార్గాన్ని ఎన్నుకున్నారు. కవిటి మండలం పీకే పాలెంకు చెందిన ఏడుగురు, సోంపేట మండలానికి చెందిన మరో ఐదుగురు ఓ బోటులో ఈనెల 14న చెన్నై సమీపంలోని రాయపురం తీరం నుంచి ప్రయాణం ప్రారంభించారు. రొట్టెలు, బిస్కెట్లు, అటుకులు వంటి నిల్వ పదార్థాలను పట్టుకుని దాదాపు 95 గంటలు ప్రయాణం చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఇద్దివానిపాలెం సమీపంలో తీరానికి చేరుకున్నారు. అంతా బాగానే ఉన్నా కరోనా ప్రభావిత ప్రాంతమైన చెన్నై నుంచి వీరు వస్తుండడంతో వీరిని గ్రామాల్లోకి రానివ్వకూడదని  వారి గ్రామాల వారు తీర్మానం చేశారు. అలాగే వీరు వస్తున్న విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు నమోదు కాని జిల్లాల్లో శ్రీకాకుళం ఉంది. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి వచ్చే వలస కూలీల వల్ల పరిస్థితి తారుమారవుతుందన్న బెంగతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తీరప్రాంత పోలీసులకు (మెరైన్) సమాచారం ఇవ్వడంతో మత్స్యకారులు ఒడ్డుకు చేరక ముందు నుంచే వీరు గస్తీ ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి స్థానిక పోలీసులు, మెరైన్ పోలీసులతో సమావేశమయ్యారు. తీరంలో ఏఏ ప్రాంతాల్లో బోట్లు ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉందన్న దానిపై ఆరా తీశారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

దీంతో వలస కూలీలు సముద్ర మార్గంలో ఏ క్షణమైనా ఒడ్డుకు చేరుకోవచ్చన్న సమాచారంతో రణస్థలం నుంచి ఇచ్చాపురం వరకు తీరప్రాంతంలో గట్టి నిఘా పెట్టారు. మత్స్యకారులు నిన్న సాయంత్రానికి ఇద్దివానిపాలెం సమీపంలో ఒడ్డుకు చేరుకోగానే వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలించారు. ఈ రోజు వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

More Telugu News