Wife kidnap: అదనపు కట్నం కోసం సొంత భార్యనే కిడ్నాప్ చేసిన ఘనుడు

  • హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఘటన
  • భర్త వేధింపులతో తండ్రి వద్దకు వచ్చిన బాధితురాలు
  • కిడ్నాప్ ను అడ్డుకున్న తండ్రికి తీవ్ర గాయాలు
Husband kidnaps his own wife in Hyderabad

అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యనే భర్త కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. నగరంలోని మాసబ్ ట్యాంకు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మహ్మద్ షరీఫ్ (74) అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేసిన షరీఫ్... తన ఆస్తులు ఇద్దరు కుమార్తెలకు చెందుతాయని గతంలోనే  చెప్పాడు.

2014లో రెండో కుమార్తె అస్మాను సల్మాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంత కాలం భార్యతో బాగానే గడిపిన సల్మాన్... ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వచ్చింది.

నిన్న తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా... స్నేహితులతో కలిసి వచ్చిన సల్మాన్ ఆమెను కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో కూతురును కాపాడేందుకు యత్నించిన షరీఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News