Mumbai: లాక్ డౌన్ పొడిగింపు ఎఫెక్ట్.. ముంబయిలో వలస కార్మికుల ఆందోళన!

  • బాంద్రా వెస్ట్ బస్ డిపో వద్ద ఘటన
  • ఆందోళన బాట పట్టిన వలస కార్మికులు  
  • తమ స్వస్థలాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్
Lock down extention effect in Mumbai

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని ప్రకటన నేపథ్యంలో ముంబయిలోని వలస కార్మికులు రోడ్డెక్కారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న బాంద్రా వెస్ట్ బస్ డిపో వద్దకు రోజు కూలీ కార్మికులు వెయ్యి మంది వరకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.

ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలో ఉన్న మురికివాడల్లో నివసిస్తున్న వీరు తమకు రవాణా సదుపాయం కల్పిస్తే తమ స్వస్థలాలకు వెళ్లిపోతామని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.

మా జీవనోపాధి ఘోరంగా దెబ్బతింది: ఓ వలస కార్మికుడు

పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా సంపాదన లేక ఇబ్బంది పడుతున్న తమకు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఆహారం అందిస్తున్నారని ఓ వలస కార్మికుడు చెప్పాడు. అయితే, తమ జీవనోపాధి ఘోరంగా దెబ్బతిందని, తమ స్వస్థలాలకు తాము వెళ్లి పోవాలనుకుంటున్నామని, లాక్ డౌన్ పొడిగింపు ప్రకటనతో తాము సంతోషంగా లేమని చెప్పాడు.

దాచుకున్నదంతా అయిపోయింది: మరో వలస కార్మికుడు

తాము ఇంత వరకూ సంపాదించి దాచుకున్న డబ్బులన్నీ మొదటిసారి విధించిన లాక్ డౌన్ కాలంలోనే అయిపోయాయని పశ్చిమబెంగాల్ లోని మాల్దా నుంచి ఇక్కడికి వచ్చిన వలస కార్మికుడు అసదుల్లా షేక్ తెలిపాడు. లాక్ డౌన్ పొడిగింపుతో ఇక ఖర్చు చేసేందుకు తమ వద్ద డబ్బు లేదని, తినేందుకు ఏమీ లేదని, తమ స్వస్థలాలకు వెళ్లాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.

More Telugu News