New Delhi: ఆహారం కోసం తన్నుకుని, పునరావాస కేంద్రాన్ని తగలెట్టేశారు!

  • న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ సమీపంలో ఘటన
  • సిబ్బందిపై దాడి చేసిన వలస కార్మికులు
  • యమునా నదిలో దూకి ఒకరి మృతి
Shelter Zone Set on Fire by Inmates

లాక్ డౌన్ సమయంలో నిరాశ్రయులుగా మిగిలిన వారిని ఆదుకునేందుకు న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఇక్కడ ఉంటున్న వలస కార్మికుల మధ్య ఆహారం కోసం జరిగిన గొడవ మరింత పెద్దదై, మొత్తం పునరావాస కేంద్రాన్ని తగులబెట్టేంత వరకూ వెళ్లింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడ పని చేస్తున్న వారిపై దాడికి దిగిన వలస కార్మికులు, ఆపై దానికి నిప్పంటించారు. పక్కనే ఉన్న యమునా రివర్ లోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. నదిలో దూకిన వారిలో ఒకరు మరణించారు.

ఆపై తమ తోటి కార్మికుని మృతికి షెల్టర్ జోన్ స్టాఫ్ కారణమంటూ, పలువురు నిరసనలకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను తరలించగా, వారిపై రాళ్లు రువ్వారు. షెల్టర్ జోన్ ను తగులబెట్టిన కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ పునరావాస కేంద్రంలో దాదాపు 250 మంది వరకూ తలదాచుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, నదిలో మునిగి చనిపోయిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షెల్టర్ జోన్ కు నిప్పంటించిన తరువాత ఆ ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. 

More Telugu News