PPEs: ఇండియాలో ఇదే వాస్తవం... 70 లక్షల రక్షణ కవచాలు అవసరమైతే, 70 వేలు కూడా లేవు!

  • ఇప్పటివరకూ ఇచ్చిన ఆర్డర్ లో అందింది ఒక శాతం లోపే
  • మూలధనం కొరతను ఎదుర్కొంటున్నామంటున్న కంపెనీలు
  • పీపీఈలు, మాస్క్ ల కోసం విదేశాలవైపు కేంద్రం చూపు
Lessthan 1 Percent of PPEs Supplied Till Date

కరోనా వైరస్ పై పోరాడుతూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్సను అందిస్తున్న ఫ్రంట్ లైన్ వైద్య సిబ్బందికి సరిపడా, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్)ల కొరత ఎంత అధికంగా ఉందంటే, దేశంలో 70 లక్షల పీపీఈలు అవసరం కాగా, ఇంతవరకూ కేవలం ఒక్క శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. ప్రభుత్వం భారీ ఎత్తున పీపీఈలకు ఆర్డర్ చేసినప్పటికీ, ఇప్పటివరకూ 70 వేలకన్నా తక్కువగానే సరఫరా అయ్యాయి.

ఇక, 1.09 కోట్ల ఎన్ 95 మాస్క్ లను ప్రభుత్వం ఆర్డర్ చేయగా, ఇప్పటివరకూ సుమారు 21 లక్షల మాస్క్ లు మాత్రమే చేతికందాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అధీనంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ కు పీపీఈలు, మాస్క్ లను కొనుగోలు చేసి సరఫరా చేసే అధికారాన్ని కల్పించారు. ఇదే సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు తమంతట తాముగా వీటిని కొనుగోలు చేయరాదన్న నిబంధన కూడా ఉంది. తామే కొనుగోలు చేసి, వాటిని అవసరమైన రాష్ట్రాలకు అందిస్తామని కేంద్రం ప్రకటించడంతో, రాష్ట్రాలు వీటిని ఆర్డర్ చేయలేక, డిమాండ్ మేరకు సరఫరా చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఇక, ఈ మధ్యాహ్నం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, లాక్ డౌన్ తొలగింపు వ్యూహాలపై చర్చించిన వేళ, పలువురు పీపీఈల కొరతను గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం కేంద్రం 39 దేశవాళీ కంపెనీలకు 70 లక్షల పీపీఈలను, కోటికి పైగా మాస్క్ లను ఆర్డర్ ఇచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ఈ 39 కంపెనీల్లో ఇప్పటివరకూ కేవలం 8 మాత్రమే పీపీఈలను సరఫరా చేయడం ప్రారంభించాయి. చాలా కంపెనీలు, ఇంకా తమకు ప్రభుత్వం నుంచి పర్చేజ్ ఆర్డర్ రాలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. మరికొన్ని కంపెనీలు లాక్ డౌన్ కారణంగా వర్కింగ్ కాపిటల్ కొరతను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నాయి.

ఇక, ఈ కంపెనీల్లో ఐదింటికి మాత్రమే లాక్ డౌన్ కు ముందే ఆర్డర్లు అందగా, మిగతా 34 కంపెనీలకూ లాక్ డౌన్ ప్రారంభమైన తరువాత ఆర్డర్లు వెళ్లాయని తెలుస్తోంది. మార్చి 7న అమ్రిల్స్ హెల్త్ కేర్, అరవింద్ లిమిటెడ్, సాయి సినర్జీ, సూర్ సేఫ్టీ కంపెనీలకు 6.2 లక్షల పీపీఈలకు, మార్చి 17న ఎస్సీజీ ఎంటర్ ప్రైజస్ కు 1.6 లక్షల పీపీఈల సరఫరాకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. ఇక మరో 24 కంపెనీలకు ఏప్రిల్ 1 తరువాత 36.7 లక్షల పీపీఈలకు ఆర్డర్ వెళ్లింది.

ఇక ఎన్ 95 మాస్క్ ల విషయానికి వస్తే, మొత్తం మూడు కంపెనీలకు ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వగా, ఓ కంపెనీ ఇప్పటివరకూ ఒక్క మాస్క్ ను కూడా సరఫరా చేయలేదు. పీపీఈలు, మాస్క్ ల కొరతపై దృష్టి సారించిన కేంద్రం, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది.

More Telugu News