Narendra Modi: జాతిని ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్న నరేంద్ర మోదీ!

  • రేపు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
  • ఆ తరువాత లాక్ డౌన్ పై స్పష్టత వచ్చే అవకాశం
  • ప్రస్తుత విధానం మారుతుందంటున్న కేంద్ర వర్గాలు
Narendra Modi Likely To Address Nation Again

ఈ నెల 14తో ఇండియాలో లాక్ డౌన్ ముగుస్తుందా? లేదా? ఒకవేళ లాక్ డౌన్ ను తొలగించాలని కేంద్రం భావిస్తుంటే, తదుపరి కరోనా మహమ్మారిపై అవలంబించాల్సిన వ్యూహం ఏంటి? తదితర ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం ఇస్తారని తెలుస్తోంది. శనివారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ ను నిర్వహించనున్న నరేంద్ర మోదీ, ఆ తరువాత జాతిని ఉద్దేశించి, మరోమారు ప్రసంగిస్తారని తెలుస్తోంది.

కాగా, లాక్ డౌన్ కొనసాగుతుందని, అయితే, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం మారుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు ఉండబోవని, నిత్యావసరాల రవాణా మాత్రం కొనసాగుతుందని, స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాల మూసివేత కొనసాగుతుందని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయిన నేపథ్యంలో, కొన్ని సెక్టార్లకు ఊరట కలిగిస్తూ, నిర్ణయాలు ఉంటాయని, సామాజిక దూరం పాటిస్తూ ఫ్యాక్టరీలను నిర్వహించే వీలు కల్పిస్తారని సమాచారం.

కాగా, ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా, ఇండియాలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భారీగా నష్టపోయిన రంగాల్లో విమానయాన రంగం ముందు నిలిచింది. ఈ నేపథ్యంలో విమానంలో మధ్య సీటును ఖాళీగా ఉంచుతూ, బుకింగ్స్ తీసుకుని, విమానాలను నడిపించేందుకు కూడా అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బుధవారం నాడు జరిగిన వివిధ పార్టీల పార్లమెంటరీ నేతల సమావేశంలో, లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ప్రధాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. "ప్రతి ఒక్కరినీ కాపాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దేశంలో పరిస్థితిని దిగజారకుండా చూస్తాం. సోషల్ ఎమర్జెన్సీ అమలులోనే ఉంటుంది. ఇంకొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. నిఘాను మరింతగా పెంచుతాం" అని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి తరువాత జీవితం ఎన్నడూ ఒకేలా ఉండబోదని, ప్రజల దైనందిన కార్యకలాపాల్లో మార్పు తప్పనిసరని కూడా ఆయన అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, వేలాది మంది పేద కార్మికులు ఉపాధి కోల్పోయినా, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా, లాక్ డౌన్ ను పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధానిని కోరుతున్నారు. ఒడిశా అయితే, ఏకంగా లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కూడా.

More Telugu News