Imran Khan: పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి: ఇమ్రాన్ ఖాన్

  • పాకిస్థాన్ లో 4 వేలకు పైగా కరోనా కేసులు
  • ఇప్పటికీ పాక్షికంగానే లాక్ డౌన్
  • సంపూర్ణ లాక్ డౌన్ తో ఆకలి చావులు పెరుగుతాయన్న ఇమ్రాన్ ఖాన్
Pakistan PM Imran Khan deeply concerns about corona situations

పాకిస్థాన్ లో కరోనా ప్రభావంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో తీవ్రపోరాటం చేస్తున్నా పాకిస్థాన్ లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పుడక్కడ 4 వేలకు పైగా కరోనా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, మున్ముందు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టమేనని, పరిస్థితి మరింత దిగజారవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పాక్ లో పాక్షికంగానే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దేశంలో 5 కోట్లకు పైగా పేదలున్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తే ఆకలి చావులు సంభవిస్తాయని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలు ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని హితవు పలికారు. కాగా, పాక్ లో కరోనా తీవ్రతతో సామాన్యులు ఇక్కట్లు ఎదుర్కొంటుండడంతో ప్రభుత్వం 'ఎహసాస్ ఎమర్జెన్సీ క్యాష్ ప్రోగ్రామ్' ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వనున్నారు.

More Telugu News