Kishan Reddy: లాక్‌డౌన్‌ పొడిగింపు అంశంపై ఆలోచిస్తున్నాం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

  • అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి 
  • ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారు 
  • మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతో కూడా మాట్లాడారు
kishan reddy on corona virus

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించాలని డిమాండ్ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించి పలు కీలక విషయాలు తెలిపారు. లాక్‌డౌన్‌ పొడిగింపు అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. 'ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాలన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు' అన్నారు.

'మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ఉన్న పరిస్థితులను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పలు అంశాలు వివరిస్తూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కూడా త్వరలో మాట్లాడబోతున్నాం' అని కిషన్‌ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

More Telugu News